
హైదరాబాద్: యెమెన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో అమెరికా యుద్ధ విమానాలు భీకర దాడులకు దిగాయి. దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. సనా (Sana), హోదైద , అమ్రాన్ నగరాలపై బాంబులు జార విడిచినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ దాడులు చోటుచేసుకున్నాయి. తాజా దాడుల్లో హోదైదలోని పోర్టు, విమానాశ్రయం కూడా ధ్వంసమైనట్లు హూతీలు చెబుతున్నారు. తమ దాడులు ఏమాత్రం ఆగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై చేసిన దాడుల్లో 70 మంది చనిపోయారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైంది. ఈ దాడిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. ఈ చర్యలు తీవ్ర ఆందోళనకరమన్నారు. కాగా హూతీ రెబల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.