
రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం మరో నాలుగు రోజులు పాటు అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరకోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఈ ప్రబావంతో వాతావరణం కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుందని, మరికొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోస్తాంధ్రలో మాత్రం వాతావరణం కూల్ గా ఉంటుందని, రాయలసీమలో మాత్రం వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు సమాచారం అందించింది.
ఈ జిల్లాల్లో నేడు వర్షం…
ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని, మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో మాత్రం నేడు తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. పశువుల కాపర్లు, రైతులు పొలాల్లో చెట్ల కిందకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రానున్న నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా తెలిపింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని, నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందని కూడా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణ జిల్లాల్లోనూ.
ఇక తెలంగాణలో నేడు కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి పాత జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని తెలిపింది. కానీ మిగిలిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని, నేడు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి మరింత పెరిగే అవకాశముందని, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పగటి వేళల్లో పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.