* అమరావతి అంటే మోడీకి అభిమానం..
ఐదు కోట్ల మందికి అమరావతి( Amravati ) జీవనాడి అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో అమరావతి అంటే పరదాలు, సెక్షన్లు గుర్తుకు వచ్చేలా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చేసినది ధర్మయుద్ధంగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. ఈ ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించాలని తెలిపారు. రాష్ట్రం కోసం.. రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో సుమారు 2000 మంది రైతులు చనిపోవడం ఆందోళన కలిగించిందన్నారు. ఇదే విషయాన్ని కొంతమంది అమరావతి మహిళా రైతులు తనను ప్రశ్నించారని.. ఇదంతా ప్రధాని మోదీకి తెలుసునా అని అడిగారని.. కానీ ప్రతి విషయం ఆయనకు తెలుస్తుందన్నారు. తెలియకుండా ఉండదని తాము నాడే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఎంత బిజీగా ఉన్నా.. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
* అందరి ఆకాంక్షలకు అనుగుణంగా..
రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల తరుపున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మా మదిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం( Amravati capital ) ఉంటుంది. అమరావతి మహిళా రైతుల పాత్ర అమోఘమని.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు పవన్. అందరి ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం, అభివృద్ధి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రధాని మోదీ అమరావతికి వచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పహల్గాం దాడిలో 27 మంది చనిపోయారని.. ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా అమరావతిపై ఉన్న అభిమానంతోనే ప్రధాని వచ్చారని.. ఆయనకు మన భవాని అమ్మవారు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు పవన్ కళ్యాణ్.
