
చాలా సినిమాల్లో చూపించినట్లు రాజకీయ నాయకులకు బినామీలు ఉంటరని.. వారికి సంబంధించిన అత్యంత విలువైన అనధికారిక ఆస్తులన్నీ వాళ్ల వాళ్ల డ్రైవర్లు, వాళ్ల ఇంట్లో పనిచేసేవాళ్ల పేర్ల మీద పెడతారని చెబుతుంటారు. ఈ క్రమంలో… ఓ ఎంపీ కారు డ్రైవర్ కు రూ.150 కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇచ్చిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును… మహారాష్ట్రలో ఓ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎంపీ) కారు డ్రైవర్ కు రూ.150 కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ బహుమతికి సదరు డ్రైవర్ కు నిజాం దివాన్ వారసులు ఇచ్చారట. దీంతో.. ఈ వ్యవహారంపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. వెంటనే ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాళ్లోకి వెళ్తే… శివసేన ఎంపీ సందీప్ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ వద్ద సుమారు 13 ఏళ్లుగా కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు జావెద్ రసూల్ షేక్. ఆయనకు ఛత్రపతి శంభాజీనగర్ లో ఉంటున్న నిజాం దివాన్ వారసులు రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గీఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు.
అయితే… ఈ వ్యవహారంపై ముజాహిద్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన ముజాహిద్ ఖాన్… ఈ భూమిపై దివాన్ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని తెలిపారు.
అయితే… అలాంటి భూమిని ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేని వ్యక్తికి గిఫ్ట్ డీడ్ గా ఎలా ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు. దీంతో… ముంబైలో మూడెకరాల భూమి ఏమిటి.. డ్రైవర్ కు గిఫ్ట్ డీడ్ రాసివ్వడం ఏమిటి.. దాని విలువ సుమారు రూ.150 కోట్లు అని తెలిసీ సదరు వ్యక్తి ఇంకా డ్రైవర్ గా పనిచేయడం ఏమిటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!
ఈ క్రమంలో… ఈ వ్యవహారంపై పోలీసులు తనను సంప్రదించారని ఎంపీ కుమారుడు, ఎమ్మెల్యే విలాస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఈ భూమి బదిలీకి సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని తాను పోలీసులకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో… ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు స్పందించారు.
ఇందులో భాగంగా… ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా.. గిఫ్ట్ డీడ్ పై సంతకం చేసిన వారితో పాటు సంబంధిత కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే… సదరు డ్రైవర్ కు, నిజాం దివాన్ వారసులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.