
Heat Stroke : తెలంగాణలో ఎండలు, వడగాలులు తీవ్రంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో వడదెబ్బ (Heat Stroke) కారణంగా పలు మానవ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ పరిణామాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించి వడదెబ్బను ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఇచ్చే రూ. 50,000 ఎక్స్గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచింది. ఈ సహాయం రాష్ట్ర విపత్తు సహాయ నిధి (State Disaster Response Fund) నుంచి అందించనున్నారు.
ఇకపై మరణాల నివారణకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలకు అప్రమత్తత కలిగించేలా గ్రామ స్థాయి నుండి నగరాల వరకు అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సూచనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎండలో ఎక్కువసేపు తిరగకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.