
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే, అధికారిక చర్చలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఎవరూ అనవసరంగా మాట్లాడి కొత్త వివాదాలను సృష్టించవద్దని సూచించారు. మంత్రుల పనితీరును తాను అంచనా వేస్తున్నానని, త్వరలో మార్కుల ప్రాతిపదికన ఈ విషయాన్ని వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపారు. ఏడాది అవుతున్నా కొందరు మంత్రులు ఇంకా సరైన రీతిలో పనిచేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు తమ శాఖలపై పూర్తి నియంత్రణ సాధించాలని, అలాగే తమకు అప్పగించిన జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా పర్యటనల సందర్భంలో…
మంత్రులు కేవలం జిల్లాలకు వెళ్లి, ఏదో వెళ్లి వచ్చామని చెప్పడం సరిపోదని, అక్కడి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని, నాయకులు మరియు కార్యకర్తల మధ్య అంతరం లేకుండా చూడాలని చంద్రబాబు కోరారు. ఒకసారి జిల్లాకు వెళ్లిన తర్వాత అమరావతిలోనే ఉండిపోకుండా, కార్యకర్తలు, నాయకులు చెప్పిన సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం ఫాలో-అప్ చేయాలని, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా మంది మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరించినట్లు మౌనంగా ఉంటున్నారని, కానీ సమస్యలు మళ్లీ మొదటికి వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
ఎవరూ మాట్లాడవద్దని…
మద్యం కుంభకోణం విషయంలో ఎవరూ మాట్లాడవద్దని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. అనవసరంగా మాట్లాడితే అది పక్కదారి పట్టే ప్రమాదం ఉందని, దర్యాప్తు సంస్థలపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. జగన్ హయాంలో జరిగిన అవినీతిని నిష్పక్షపాతంగా బయటకు తీస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థలను వారి పనిని చేసుకోనివ్వాలని చంద్రబాబు సూచించారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా అధ్యయనం చేసి స్పందించాలని, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి వెంటనే స్పందించవద్దని కూడా ఆయన తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకోవాలని, రేషన్ వాహనాలను నిలిపివేయాలని ఆదేశించారు. అయితే, వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటికి వెళ్లి రేషన్ బియ్యం అందించాలని చంద్రబాబు సూచించారు.