
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రతోపాటు ఉన్నతాధికారులు చర్చించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత విషయంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులను డీజీపీ ఆదేశించారు.
సెక్యూరిటీ ప్రొటోకాల్స్…
సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీపడవద్దని అధికారులకు డీజీపీ సూచించారు. జనసమూహంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని అన్ని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా చర్యల విషయాన్ని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సామాన్య ప్రజలు, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మేర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.