
భారత వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు మాల్దీవులకు రెండు మూడు రోజుల్లో వచ్చి బంగాళాఖాతం వరకూ విస్తరాయని తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. సల సలకాగే మండే ఎండలతో ఉన్న ప్రజలకు ఇది ఊరట నిచ్చే వార్త అని చెప్పాలి. రోహిణి కార్తెకు ముందే వాతావరణం చల్లబడుతుందని తెలపడంతో ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఉక్కపోత, ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం త్వరగానే ఈ ఏడాది లభించనుందని భారత వాతావరణ శాఖ చెప్పింది.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. మార్చి నెలలో కాచిన ఎండలను చూసి మే నెలలో యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటతాయని అంచనా వేసినా ఇప్పటి వరకూ నలభై మూడు డిగ్రీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో దాటకపోవడం నిజంగా చాలా మందికి ఊరట కలిగించే అంశమే. లేకుంటే వడదెబ్బకు పిట్టల్లా రాలిపోయేవారు. మే 28 నుంచి జూన్ 8వ తేదీ వరకూ రోహిణి కార్తె ఉంది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన అప్ డేట్ తో రోహిణి నుంచి ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పించుకున్నట్లేనని చెప్పాలి.
తుపాను గా మారే ఛాన్స్?
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తుపాను గా మారే అవకాశముందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా ఉత్తరాంధ్రా, దక్షిణ కోస్తాలో ఎక్కువ వర్షాలు పడతాయని చెప్పింది. ఈ జిల్లాలకుచెందిన ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు నిరంతరం అలెర్ట్ గా ఉండాల్సిందేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశార.
శక్తిగా నామకరణం…
తెలంగాణలో రాబోయే మూడురోజులు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు వర్ష సూచనలు చేసింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడి ఉపరితల ఆవర్తానినకి శక్తి అని నామకరణం చేసింది. అది కనుక తుపానుగా మారితే వచ్చే వారం రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు పడతాయని చెప్పింది.