
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు.ఇందుకు సంబంధించిన నిర్ధిష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్న కవిత టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందన్నారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తుందని, తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని కవిత తెలిపారు.
పెద్ద మొత్తంలో అప్పులు…
పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారన్న కల్వకుంట్ల కవిత కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారంటూ ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటి ? అని కవిత నిలదీశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమని కవిత వ్యాఖ్యానించారు.