
ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై కాల్పులు జరపడంను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. భారత్పై జరిగిన ఉగ్ర దాడిని ఆగ్ర దేశాల అధినేతలు సైతం ఖండించారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడితో ఇండియా పాకిస్తాన్ మధ్య అంతరం మరింతగా పెరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ పనికి తెగబడ్డారు అనే విమర్శలు వస్తున్నాయి. మరో వైపు పాకిస్తాన్ ఆ దాడితో తమకు సంబంధం లేదని చెప్పింది. రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం కనిపించడం లేదు. రెండు సినిమాల మధ్య మొన్నటి వరకు ఉన్న సంబంధాలు సైతం దెబ్బతిన్నాయి. పాక్ సినిమాలను ఇండియాలో పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదే సమయంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఒక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ కూతురు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. చాలా మంది ఇమాన్వీ జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పాకిస్తాన్తో సంబంధం ఉందంటూ కొందరు డైరెక్ట్ విమర్శలు చేశారు. ప్రభాస్ సినిమా నుంచి ఆమెను తప్పించాలంటూ కొందరు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఇమాన్వీ స్పందించింది. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారం వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. పౌరసత్వం విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పింది.
తన గురించి, తన పౌరసత్వం గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ స్పందించింది. సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ప్రచారంను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన నోట్లో ఆమె స్పందిస్తూ… పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అత్యంత హృదయ విదారకమైన ఘటన. ఈ ఘటనలో చనిపోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. అమాయకులను చంపేయడం దారుణం అంది. నా గుర్తింపు, నా కుటుంబం గురించి కొందరు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. నా కుటుంబంలో ఎవరికి గతంలో పాకిస్తాన్ సైన్యంతో సంబంధం లేదు, ఇప్పుడు కూడా ఏ ఒక్కరూ పాకిస్తాన్ సైన్యం లో లేరు. అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధను కలిగించిందని ఇమాన్వీ అసహనం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు నా గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, నా జాతీయత గురించి మాట్లాడటం ఆవేదన కలిగించింది. ఆన్ లైన్ ద్వారా వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో తాను ఈ ప్రకటన చేస్తున్నాను. అబద్దాలను ప్రచారం చేయడం ఇప్పటికి అయినా మానాలి. నా గురించి నన్ను అడిగితేనే ఎక్కువగా తెలుస్తుంది. ఎవరో చెప్పిన విషయాలను పట్టుకుని నన్ను విమర్శించడం, నా జాతీయత గురించి వ్యాఖ్యలు చేయడం, నన్ను పాకిస్తాన్కి చెందిన అమ్మాయి అంటూ ట్రోల్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఇమాన్వీ తన లేఖలో పేర్కొంది. పాకిస్తాన్తో తనకు సంబంధం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.